about - గ్రామస్థాయి భూభారతి రెవెన్యూ సదస్సు లో దరఖాస్తు సమర్పించారు భూ సమస్యకు పరిష్కారం లభించింది
భర్త మరణించాక ఆత్రం సముద్ర బాయి పేరు మీదికి భూమిని విరాసత్ చేయాల్సి ఉండింది. మండల రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామంలో ఎవరివైనా విరాసత్ చేసేవి ఉంటే మాకు చెప్పండి అని అడిగారు.
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ కు 2023 జులై 3 న ఒక భూమి సమస్య గురించి ఫోన్ వచ్చింది.
ఆత్రం సముద్ర భాయి భర్త తెలంగా రావు 07-09-2016 న మరణించారు. అతని పేరు మీద ఉన్న భూమి సర్వే నెంబర్ : 62/10,విస్తీర్ణం: 3-12 ఎకరాలు.
భర్త మరణించాక ఆత్రం సముద్ర బాయి పేరు మీదికి భూమిని విరాసత్ చేయాల్సి ఉండింది. మండల రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామంలో ఎవరివైనా విరాసత్ చేసేవి ఉంటే మాకు చెప్పండి అని అడిగారు. 2016 సంవత్సరంలో ధరణి పోర్టల్ లేదు. మాన్యువల్ గా దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భూ సమస్య పరిష్కారం కాలేదు.
ఈ సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ , తహసిల్దార్ కూడా మండలం నుండీ ట్రాన్స్ఫర్ అయ్యారు. మండలానికి కొత్త తహసిల్దార్ రావడంతో, భూ సమస్య బాధితులు కార్యాలయానికి వెళ్లి తమగోడు విన్నవించారు. అప్పటికి ధరణి పోర్టల్ వచ్చింది.వివరాలు ఆన్లైన్లో పొందుపరిచారు. సర్వే నంబర్ ఆన్లైన్లో చూపిస్తుంది కానీ డిజిటల్ సంతకం కాలేదు .
కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ రైతులకు సమస్య పరిష్కారం దిశగా ఏ విధంగా సహాయం చేస్తుందో, గ్రామస్తులకు అవగాహన ఉండడంతో, ఈ భూ సమస్య మా దృష్టికి వచ్చింది.
10-07-2023 రోజున సిర్పూర్-యు మండలం తహసిల్దార్ కార్యాలయంలో విరాసత్ కొరకు దరఖాస్తు పెట్టించాం . తహసిల్దార్ గ్రామానికి వచ్చి, ఎంక్వైరీ చేసి, భూమి ఉందో లేదో చూసి, గ్రామస్తులతో మాట్లాడి వాంగ్మూలము రాస్తాము అని అన్నారు.
తర్వాత కొద్ది రోజులకే ఈ తహసిల్దార్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ లోపు ఎన్నికలు రావడం,ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో సమస్య ముందుకు వెళ్లలేదు. కొత్త తహసిల్దార్ వచ్చారు. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. కొత్త తహసిల్దార్ కు భూ సమస్య గురించి మళ్ళీ వివరించాము.త్వర లోనే ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి అంతవరకు ఆగవలసిందేనని దరఖాస్తుదారులకు తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసింది. కిసాన్ మిత్ర కార్యకర్త భూ సమస్య బాధితులను కలిసి భూ భారతి రెవెన్యూ సదస్సులో మళ్ళీ దరఖాస్తు పెట్టండి అని సూచించారు. శెట్టి హడాప్నూర్ గ్రామంలో 06-06-2025 న భూభారతి రెవెన్యూ సదస్సులో రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
ఆత్రం సముద్రబాయి తన భూ సమస్య గురించి మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు 2025 ఆగస్టు నెలలో గ్రామానికి వచ్చి గ్రామస్తులతో మాట్లాడి,సర్వే నంబర్: 62/10 విస్తీర్ణం:3-12 భూమి ఉందా? లేదా? సాగు చేస్తున్నారా? లేదా?
అని విచారణ చేశారు.రిపోర్ట్ కూడా రాశారు. భూమికి సంబంధించిన మ్యాప్ లో సర్వే నంబర్లు చూశారు. రికార్డులు చూశారు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి.
రెవెన్యూ అధికారులు భూ సమస్య బాధితులను తహసిల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పారు. తహసిల్దార్ కార్యాలయానికి 2025 సెప్టెంబర్ మాసంలో వెళ్లారు. భూభారతిలో వివరాలు ఆన్లైన్లో కరెక్ట్ గానే ఉన్నాయి. డిజిటల్ సంతకం పెండింగ్ లో ఉంది. తహసిల్దార్ఆత్రం సముద్ర బాయి సర్వే నంబర్ లో భూభారతి ఆన్లైన్ లో డిజిటల్ సంతకం చేశారు. మొత్తం మీద భూ సమస్య పరిష్కారం అయింది. ప్రస్తుతం భూ భారతిలో ఆన్లైన్ లో చూపిస్తుంది. పట్టా పాస్ పుస్తకం పోస్ట్ ఆఫీస్ ద్వారా రావలసి ఉంది.
ఆత్రం సముద్ర బాయి గారి భూ సమస్య పరిష్కారానికి దాదాపు 8 సంవత్సరాలు పట్టింది. గత 8 ఏళ్లలో భూ సమస్య పరిష్కారం కాని కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ అందలేదు.
ఆదివాసి ప్రాంతాలలో ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి భూ సమస్యలు అనేకం ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రభుత్వ అధికారులు మారుతున్నారు కానీ భూ సమస్యలు పరిష్కారానికి చాలా సమయం పడుతున్నది.

Kanaka. AnandaRao
Kisanmitra, Asifabad field coordiantor 9493752633
No comments yet. Login to start a new discussion Start a new discussion